పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు నదిలో చిన్న పడవలో విహారయాత్రకు వెళ్లగా, తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం పదిమంది నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఆరుగురిని సురక్షితంగా రక్షించారు. అయితే మరో నలుగురు గల్లంతయ్యారు. అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరో ఇద్దరి కోసం సహాయక బృందాలు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

